Sri Rama navami History and Significance in Telugu

Sri Rama navami History and Significance in Telugu

శ్రీరామనవమి (Sri Rama Navami) :-

శ్రీరామనవమి హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. ఈ పండుగను హిందువులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. శ్రీ సీతారామ కళ్యాణము, రాముడు రావణున్ని సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చింది శ్రీరామనవమినాడే. ఆ మరునాడు దశమి శ్రీరామ పట్టాభిషేకం రామునికి జరిగింది. శ్రీరామనవమి మహిమ, ప్రాముఖ్యత, విశిష్ఠత, శ్రీరామనవమి రోజు చేయవలసిన పనులు గురించి ఇప్పుడు తెలుసుకుందాము… (Sri Rama navami History and Significance in Telugu)

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

చరిత్ర (Sri Rama navami History):-

రామాయణంలో అయోధ్య (కోసల దేశం) కు రాజైన దశరథుడికి ముగ్గురు భార్యలు; కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఆయనకు ఉన్న బాధ అంతా సంతానం గురించే. సంతానం లేక పోతే రాజ్యానికి వారసులు ఉండరని. అప్పుడు వశిష్ట మహాముని రాజుకు పుత్ర కామేష్టి యాగం చేయమని సలహా ఇచ్చాడు. రుష్య శృంగ మహామునికి యజ్ఞాన్ని నిర్వహించే బాధ్యతను అప్పజెప్పమన్నాడు. వెంటనే దశరథుడు ఆయన ఆశ్రమానికి వెళ్ళి ఆయనను తన వెంట అయోధ్యకు తీసుకుని వచ్చాడు. ఆ యజ్ఞానికి తృప్తి చెందిన అగ్ని దేవుడు పాయసంతో నిండిన ఒక పాత్రను దశరథుడికిచ్చి భార్యలకు ఇవ్వమన్నాడు. దశరథుడు అందులో సగ భాగం మొదటి భార్య కౌసల్యకూ, రెండో సగ భాగం చిన్న భార్య యైన కైకేయికి ఇచ్చాడు. వారిద్దరూ వారి వాటాల్లో సగం మిగిల్చి రెండో భార్యయైన సుమిత్రకు ఇచ్చారు. కొద్దికాలానికే వారు ముగ్గురూ గర్భం దాల్చారు.

చైత్ర మాసం తొమ్మిదవ రోజైన నవమి నాడు, మధ్యాహ్నం కౌసల్య రామునికి జన్మనిచ్చింది. అలాగే కైకేయి భరతుడికీ, సుమిత్ర లక్ష్మణ శతృఘ్నూలకు జన్మనిచ్చారు. శ్రీరాముడు ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహా విష్ణువు యొక్క ఏడవ అవతారం. రావణుని అంతమొందించడానికి అవతరించిన వాడు.

శ్రీరాముడు పితృవాక్య పరిపాలకుడు, ప్రజలను బిడ్డల పాలించిన రాజు, భార్య ప్రేమ కోసం పరితపించి పోయిన భర్త, క్రమశిక్షణ కలిగిన వాడు, వీరుడు, వేద వేదాంతాలు తెలిసినవాడు, చేసిన మేలు మరవని వాడు, సర్వ జీవుల పట్ల దయ కలిగిన వాడు, ఇలా సకల గుణాబి రామకు ఉత్తమ లక్షణాలు ఉన్నాయి.

శ్రీరామనవమి ప్రాముఖ్యత (Sri Rama navami Importance):

రామాయణంలో శ్రీరాముడికి వశిష్ట మహర్షి నామకరణం చేశారు. ఇందులో రమంతే యోగినో యత్ర రామ అని ఒక అర్థం అంటే.. యోగీశ్వరులు ఏ దేవుడి నుంచి ఆస్వాదన చెందుతారో వారే రాముడు అని అర్థం. శ్రీరామ నవమి రోజున రామ నామస్మరణ చేయడం వల్ల అనేక రెట్లు పుణ్య ఫలం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. శ్రీ రామ నవమి రోజే సీతారాముల కళ్యాణం జరిగిందని, పట్టాభిషేకం కూడా ఇదే రోజు జరిగిందని చెబుతారు. అందుకని తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సీతారాముల కళ్యాణం నిర్వహిస్తారు. రామ నవమి నాడు ప్రత్యేక పూజలు చేయడం, కళ్యాణం నిర్వహించడం, రామ మంత్రాలు జపించడం వల్ల వెయ్యి రెట్ల ఫలితం కలుగుతుందని విశ్వసిస్తారు. అంతేకాకుండా రామ నామాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో జపించడం వల్ల అనేక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని పండితులు చెబుతారు.

పూజా విధానం:

శ్రీరామ నవమి రోజున సూర్యోయం కంటే ముందే నిద్ర లేవాలి. ఇంట్లో మామిడి ఆకులు, కొబ్బరికాయను కలశంపై ఉంచాలి. శ్రీ సీతారాములకు ధూపం, దీపం, పండ్లు, పువ్వులు, వస్త్రాలు, ఆభరణాలు సమర్పించాలి. శ్రీరాములోరికి తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి. పూజ పూర్తయిన తర్వాత విష్ణు సహస్రనామం పఠించి హారతి ఇవ్వాలి. చివరగా మీ సామర్థ్యం మేరకు అన్నదానం చేయాలి.

రామ జపం:

‘రామ’ అనే రెండక్షరాలను జపించడం వల్ల మనలో ఏకాగ్రత పెరిగి ఆధ్యాత్మిక రంగంపై ఆసక్తి పెరిగేలా చేస్తుంది. అంతేకాదు ఈ ఒక్క నామంతో దుష్ఫలితాలను పోగొట్టుకోవచ్చు. ఈ మంత్రాలను పఠించడానికి ముందు ఆ భగవంతుని ఫోటో లేదా విగ్రహం ముందు దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల శుభ ఫలితాలొస్తాయని పండితులు చెబుతున్నారు.

శ్రీరాముని అనుగ్రహం కోసం:

శ్రీరామ నవమి రోజున రాముని విశిష్టత తెలిపే ఈ శ్లోకం “ఆపదా మపహర్తారం దాతారం సర్వసంపదామ్ లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహుమ్ దక్షిణే లక్ష్మణోయస్య వామేచ జనకాత్మజా పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనమ్ కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలమ్” ఈ శ్లోకాలను పఠించడం వల్ల శ్రీరాముని అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని చాలా మంది నమ్ముతారు.

శ్రీరామనవమి విశిష్టత (Sri Rama navami Significance):-

దశావతారాల్లో శ్రీ మహా విష్ణువు యొక్క ఏడవ అవతారంగా, రావణ సంహరనార్ధమై, శ్రీరాముని జన్మదినమును జరుపుకుంటారు.  శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల వేళలో త్రేతా యుగం లో జన్మించారు. 14 సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యకు ఈ రోజే వచ్చారు. శ్రీరామ నవమి రోజున సీతారామ కళ్యాణం చేయించినా, చూసినా సకల శుభాలు, అష్టశ్వర్యాలు చేకూరుతాయి!! సీతారామకళ్యాణాన్ని చూసేందుకు మనమ్మే కాదు సకల లోకాల దేవతలు దివి నుంచి భువికి దిగివస్తారంట.

కోదండ రామకళ్యాణాన్ని చూసేందుకు మనమే కాదు సకల లోకాల దేవతలు దివి నుంచి భువికిదిగివస్తారంటా…. శ్రీరామచంద్రుని దివ్య దర్శనం మహనీయంగా, నేత్ర పర్వంగా పట్ట్భాషేక సమయాన తిలకించి పులకితులవుతారట. ఆంజనేయుని పదభక్తికి మెచ్చి, హనుమ గుండెల్లో కొలువైన శ్రీరాముని భక్త పోషణ అనన్యమైనదై గ్రామగ్రామాన రామాలయం కొలువై ఉన్నాయి. అందుకే చైత్ర శుద్ధ నవమి నాడు భద్రాచలంలో సీతారామ కళ్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తారు. కాబట్టి ఏటా చైత్రశుద్ధ నవమిని శ్రీ రామనవమిగా వేడుకలు, సీతారామ కళ్యాణం ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు.

పానకం -వడపప్పు ప్రాధాన్యత:-

మన ప్రసాదాలన్నీ సమయానుకూలంగా, ఆరోగ్యాన్ని బట్టి నిర్ణయించినవే. వడపప్పు – పానకం కూడా అంతే. శ్రీరామనవమి రోజున పానకం-వడపప్పు ప్రాధాన్యత ఉంటుంది. పానకం విష్ణువుకి ప్రీతిపాత్రమైంది.  దీని వెనక ప్రాకృతిక పరమార్థము ఏమిటంటే, ఇది వేసవి కాలం కాబట్టి, వీటిని ప్రసాదం రూపంలో సేవించటం వల్ల మనుషులు ఆరోగ్యం, ఆయుష్షు అభివృద్ధి కలుగుతాయని ఆయుర్వేద పండితుల అభిప్రాయం.

శరదృతువు, వసంత రుతువులు యముడి కోరల్లాంటివని దేవీభాగవతం చెబుతోంది. ఈ రుతువులో వచ్చే గొంతు వ్యాధులకు పానకంలో ఉపయోగించే మిరియాలు, ఏలకులు ఉపశమనాన్ని ప్రసాదిస్తాయని, ఔషధంలా పనిచేస్తాయని చెబుతారు. పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి, చలవ చేస్తుంది. జీర్ణశక్తిని వృద్ధిచేస్తుంది. దేహకాంతికి, జ్ఞానానికి ప్రతీక. పెసరపప్పును ‘వడ’ పప్పు అంటారు. అంటే మండుతున్న ఎండల్లో ‘వడ’ కొట్టకుండా వేడి నుంచి కాపాడుతుందని అర్థం.

పానకం తయారీ విధానం:

కావలసిన పదార్థాలు:

  • బెల్లం – 3 కప్పులు
  • మిరియాల పొడి – 3 టీ స్పూన్లు
  • ఉప్పు – చిటికెడు
  • శొంఠిపొడి – టీ స్పూన్
  • నిమ్మరసం – మూడు టీ స్పూన్లు
  • యాలకుల పొడి – టీ స్పూన్
  • నీరు – 9 కప్పులు

తయారీ విధానం: ముందు బెల్లాన్ని మెత్తగా పొడి చేసుకుని నీళ్ళలో కలుపుకోవాలి. బెల్లం మొత్తం కరిగాక.. పలుచని క్లాత్‌లో వడకట్టాలి. ఇందులో మిరియాలపొడి, శొంఠి పొడి, ఉప్పు, యాలకల పొడి, నిమ్మరసం వేసి బాగా కలపాలి.

వడపప్పు తయారీ విధానం:

కావలసిన పదార్థాలు:

  • పెసరపప్పు – కప్పు
  • కీరా – ఒక ముక్క
  • పచ్చిమిర్చి – 1 (తరగాలి)
  • కొత్తిమీర తరుగు- టీ స్పూన్
  • కొబ్బరి తురుము -టేబుల్ స్పూన్
  • ఉప్పు – తగినంత

తయారీ విధానం: పెసరపప్పును నాలుగు గంటలు నీళ్లలో నానబెట్టాలి. నీటిని వడకట్టేసి, పప్పు ఒక గిన్నెలో వేయాలి. దాంట్లో కీరా తరుగు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొబ్బరి, ఉప్పు వేసి కలపాలి. ఈ ప్రసాదాలను స్వామివావికి నివేదన చేసి భక్తులకు వితరణ చేయాలి.

వివిధ ప్రాంతాలలో శ్రీరామ నవమి వేడుకలు:

శ్రీరామ నవమి, శ్రీరాముని జన్మదిన వేడుక. భారతదేశంలో, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు వంటి రాష్ట్రాలలో ఒక ముఖ్యమైన పండుగ. ఇక్కడ దీనిని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. వేడుకలు ప్రాంతం నుండి ప్రాంతానికి మారుతూ ఉంటాయి.

అయోధ్య, ఉత్తరప్రదేశ్: శ్రీరాముడి జన్మస్థలంగా విశ్వసించే అయోధ్యలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరుగుతాయి. నగరం దీపాలు, పువ్వులు మరియు రంగోలితో అలంకరించబడి ఉంది. మరియు భక్తులు ప్రార్థనలు చేయడానికి మరియు ఆశీర్వాదం పొందడానికి దేవాలయాల వద్దకు తరలివస్తారు.

భద్రాచలం, తెలంగాణ: భద్రాచలం శ్రీరాముడితో ముడిపడి ఉన్న మరో ముఖ్యమైన ప్రదేశం. ఎందుకంటే ఇది సీతతో రాముడి వివాహం జరిగిన ప్రదేశం అని నమ్ముతారు. భద్రాచలం లోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం అందంగా అలంకరించబడి. ప్రత్యేక పూజలు మరియు ఊరేగింపులు జరుగుతాయి.

రామేశ్వరం, తమిళనాడు: తమిళనాడులోని రామేశ్వరం, రామాయణ ఇతిహాసంతో అనుబంధానికి ప్రసిద్ధి చెందింది. భక్తులు సముద్రంలో పవిత్ర స్నానాలు ఆచరించి, రామనాథస్వామి ఆలయాన్ని సందర్శిస్తూ రాముడికి ప్రార్థనలు చేస్తారు.

కోదండ రామాలయం, ఒంటిమిట్ట, ఆంధ్రప్రదేశ్: ఒంటిమిట్ట లోని కోదండ రామాలయం ప్రాచీన హిందూ దేవాలయము. సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలలో వున్నందున ఈ క్షేత్రము ఏకశిలానగరము అని ప్రసిద్ధి చెందినది. నవ్యాంధ్ర ఏర్పడిన తరువాత ఈ ఆలయమున్న ఒంటిమిట్టను ఆంధ్రా భద్రాచలం గా పేరుగాంచింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీరామనవమి రోజున ఈ ఆలయంలోనే అధికారికంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది.

ఆ శ్రీరామ చంద్రమూర్తి ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని మనసారా కోరుకుంటూ.. మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్.. జై శ్రీరామ్..

Thank you for reading... Share this...
error: Content is protected !!